Maharashtra: చిక్కుల్లో పడిన మహారాష్ట్ర సీఎం భార్య.. మోదీని 'జాతిపిత' అని వ్యాఖ్యానించి విమర్శల పాలు!

  • ప్రధాని జన్మదినం సందర్భంగా వీడియో ద్వారా అభినందనలు
  • ఈ సందర్భంగా అత్యుత్సాహంతో వ్యాఖ్య
  • మండిపడుతున్న నెటిజన్లు

విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడితే పరిస్థితులు ఎలా ఎదురు తిరుగుతాయో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ భార్య అమృత ఫడ్నవిస్‌కు తెలిసి వస్తోంది. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయనను ‘జాతి పిత’ అని సంబోధిస్తూ పొగడ్తలు కురిపించడంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

నిన్న ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా అమృత ఓ వీడియో షేర్ చేశారు. అందులో ‘జాతి పిత నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. సమాజం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించేందుకు ఆయనే మాకు స్ఫూర్తి...’ అని వ్యాఖ్యానించారు. ఈ వీడియో పోస్టయిన మరుక్షణం నుంచి ఆమెపై నెటిజన్ల విమర్శల దాడి మొదలయ్యింది.

'బ్యాంకర్‌గా, గాయనిగా, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మీకు మన జాతిపిత మహాత్మాగాంధీ అని తెలియదా? నరేంద్రమోదీ ఎప్పుడు జాతిపిత అయ్యారు? ఎలా అయ్యారు?' అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరు ఏ దేశం గురించి మాట్లాడుతున్నారో తెలియదు మేడం... కానీ నా దేశంలో జాతిపిత మాత్రం మహాత్మాగాంధీ..’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

More Telugu News