Andhra Pradesh: అమిత్ షాను కలుసుకునే ఏర్పాటు చేయాలని కోడెల కోరారు!: బీజేపీ నేత లక్ష్మీపతి రాజా

  • కోడెల బీజేపీలోకి రావాలనుకున్నది వాస్తవమే
  • టీడీపీలో అవమానాలకు గురిచేస్తున్నారని బాధపడ్డారు
  • టీడీపీ నేతలు ఇప్పటికైనా మేల్కోవాలి

తెలుగుదేశం సీనియర్ నేత, దివంగత కోడెల శివప్రసాదరావు బీజేపీలోకి రావాలనుకున్న మాట వాస్తవమేనని బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనను పార్టీలో అవమానాలకు గురిచేస్తున్నట్లు కోడెల బీజేపీ నేతలతో చెప్పుకున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కనీసం తనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని కోడెల బాధపడ్డారని చెప్పారు. తనకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇప్పించాల్సిందిగా బీజేపీ నాయకులను కోడెల కోరారని తెలిపారు.

బీజేపీలో కోడెలను చేర్చుకునే విషయమై పార్టీలో చర్చ కూడా జరిగిందని లక్ష్మీపతి రాజా అన్నారు. కోడెల శివప్రసాదరావును ఇన్నాళ్లూ పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కోడెల ఆత్మహత్యాయత్నం చేస్తే చంద్రబాబు కనీసం ఆయన్ను పరామర్శించలేదని దుయ్యబట్టారు. ఫర్నీచర్ విషయంలో వర్ల రామయ్యతో కోడెలను చంద్రబాబు తిట్టించారని విమర్శించారు. కోడెల ఉదంతాన్ని చూసైనా టీడీపీ నేతలు చంద్రబాబు నాయకత్వాన్ని వదిలి బయటకు రావాలని లక్ష్మీపతిరాజా పిలుపునిచ్చారు.

More Telugu News