Andhra Pradesh: ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సహృదయత.. సొంత వాహనంలో ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు!

  • కృష్ణా జిల్లా ఆత్కూరులో ప్రమాదం 
  • ఆటోను బలంగా ఢీకొన్న కారు
  • ఇద్దరికి తీవ్రగాయాలు.. సాయం చేసిన మంత్రి నాని

ఏపీ డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తన సహృదయతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను తన సొంత వాహనంలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఆత్కూరు వద్ద నిన్న ఓ ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని జి.నరసింహారావు, ఐ.రాధికకు తీవ్రగాయాలయ్యాయి.

అప్పుడే అటుగా సచివాలయానికి వెళుతున్న మంత్రి ఆళ్ల నాని ప్రమాదాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. బాధితులను గుర్తించి వెంటనే తన వాహనంలో దగ్గర్లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ సందర్భంగా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి డాక్టర్లను ఆదేశించారు. కాగా, మంత్రి స్పందనకు అన్నివర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.

More Telugu News