Kodela siva prasad: నా తండ్రిని వేధించారు.. చనిపోయిన మనిషి గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారు: కోడెల కూతురు విజయలక్ష్మి

  • ప్రభుత్వం మారినప్పటి నుంచి నా తండ్రికి వేధింపులు
  • నా సోదరుడిపై, నాపై దుష్ప్రచారాలు చేశారు
  • మా ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు

ఈరోజు జరిగిన సంఘటన తన జీవితంలో ఎవ్వరూ పూడ్చలేనిదంటూ కోడెల శివప్రసాదరావు కూతురు విజయలక్ష్మి కన్నీరు మున్నీరు అయ్యారు. హైదరాబాద్ లోని కోడెల నివాసంలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని తనకు లేదు కానీ, తన తండ్రి మృతిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని, అందుకే, మాట్లాడుతున్నానని అన్నారు. చనిపోయిన మనిషి గురించి వదంతులు సృష్టిస్తున్నారని, చెడుగా ప్రచారం చేస్తున్నారంటూ వెక్కివెక్కి ఏడ్చారు.

ఏపీలో ప్రభుత్వం మారినప్పటి నుంచి తన తండ్రిపై వేధింపులు ఎక్కువయ్యాయని, ఆయనకు మూడు నెలలుగా కంటిపై కునుకు లేకుండా వేధించారని ఆరోపించారు. కనీసం ఆయన వయసుకు విలువ ఇవ్వలేదని, సీనియారిటీని కూడా గౌరవించకుండా అవమానించారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెడితే ఎంతో బాధ, నరకం అనుభవించామని వాపోయారు. తన సోదరుడు, తనపై తీవ్రమైన దుష్ప్రచారాలు చేశారని, తమ ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు అని స్పష్టం చేసిన విజయలక్ష్మి, ‘కనీసం, ఇప్పుడైనా మంచి మాటలు ప్రచారం చేయండి, మా బతుకులు మమ్మల్ని బతకనీయండి’ అంటూ కన్నీటి పర్యంతమైన విజయలక్ష్మిని ఆమె పక్కన ఉన్న వారు ఓదార్చారు.

More Telugu News