TRS: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కారు ఢీకొని వ్యక్తి మృతి.. ఎమ్మెల్యే పరార్

  • ఎమ్మెల్యే కారు ఢీకొని శ్రీకాకుళం వాసి మృతి
  • హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఘటన
  • బాధిత కుటుంబ సభ్యుల ధర్నాతో నిలిచిపోయిన ట్రాఫిక్

తన కారు ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో భయపడిన కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ కారును అక్కడే వదిలి పరారయ్యారు. హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఈ ఘటన జరిగింది.  పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగన్నాథం(40) తుమ్మలూరులో మేస్ర్తీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి  రోడ్డు దాటుతున్న జగన్నాథాన్ని కల్వకుర్తి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో జగన్నాథం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

కారు దిగిన ఎమ్మెల్యే డ్రైవర్‌తో కలిసి పరారయ్యారు. విషయం తెలిసిన మృతుడి కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. వారి ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.

More Telugu News