Kolkatha: అన్నం, బంగాళాదుంపల వేపుడుతో భోజనం... చోరీకి వచ్చి వంటచేసుకుని పని ముగించుకెళ్లిన దొంగ!

  • పశ్చిమ బెంగాల్ లో ఘటన
  • కూతుర్ని చూసేందుకు వెళ్లిన వితంతు మహిళ
  • తాళం వేసిన ఇంట్లో పనిచక్కబెట్టుకుని వెళ్లి దొంగ

కోల్ కతా శివారు ప్రాంతం నరేంద్రపూర్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గర్భవతి అయిన కుమార్తెను చూసేందుకు మరో ఊరు వెళ్లిన ఓ వితంతు మహిళ తిరిగొచ్చేసరికి ఇంట్లో ఆశ్చర్యకర దృశ్యాలు కనిపించాయి. షెఫాలీ సర్దార్ అనే మహిళకు భర్త లేడు. ఆమెకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. కుమార్తెను సోనాపూర్ కు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేసింది. కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. షెఫాలీ నరేంద్రపూర్ లో ఒంటరిగా ఉంటోంది. అయితే కుమార్తె గర్భం దాల్చడంతో చూసివద్దామని సోనాపూర్ వెళ్లింది. ఇదే అదనుగా తాళం వేసిన ఆమె ఇంట్లోకి దొంగ ప్రవేశించాడు.

ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తీరిగ్గా దొంగతనం చేసుకువెళ్లొచ్చని భావించాడు. కిచెన్ లోకి వెళ్లి అన్నం, బంగాళాదుంపల వేపుడు చేసుకున్నాడు. శుభ్రంగా తిని బెడ్ రూములో హాయిగా నిద్రపోయాడు. అనంతరం, ఇంట్లో ఉన్న రూ.48,000 నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. ఇంటికి తిరిగొచ్చిన షెఫాలీ జరిగిందేమిటో గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News