Crime News: అనుమానం పెనుభూతమై...భార్యను హత్యచేసిన భర్త

  • గొడ్డలితో నరికి కిరాతకంగా చంపిన వైనం
  • గత కొంత కాలంగా దంపతుల మధ్య విభేదాలు
  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం అతన్ని మృగంలా మార్చేసింది. దీంతో నిద్రిస్తున్న ఆమెను అతికిరాతకంగా నరికి చంపేశాడు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలంలోని వేగాయమ్మపేట గ్రామంలో నిన్న అర్ధరాత్రి తర్వాత జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

గ్రామానికి చెందిన మంగాయమ్మ (50), చంద్రరావు దంపతులు. భార్య ప్రవర్తనపై అనుమానం ఉన్న చంద్రరావు ఆమెను నిత్యం వేధించడమేకాక చంపేస్తానని అప్పుడప్పుడూ బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. దీంతో కసి పెంచుకున్న చంద్రరావు అర్ధరాత్రి తర్వాత నిద్రలో ఉన్న భార్యపై  గొడ్డలితో దాడిచేసి నరికి చంపేశాడు. అనంతరం పరారయ్యాడు.

ఉదయం రక్తం మడుగులో ఉన్న మంగాయమ్మను చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు.

More Telugu News