Andhra Pradesh: పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగిన కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా!

  • పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
  • 3 నెలల్లోనే 19 చారిత్రాత్మక బిల్లులు ఆమోదించాం
  • మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్ 100 రోజుల పాలనపై పవన్ చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 19 చారిత్రాత్మక బిల్లులను తీసుకొచ్చామని రాజా తెలిపారు. కానీ 650 వాగ్ధానాలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కదాన్నీ నెరవేర్చకపోగా, పవన్ కనీసం ప్రశ్నించలేదని గుర్తుచేశారు. కానీ 3 నెలల్లోనే జగన్ ప్రశ్నించేందుకు ముందుకు వచ్చారని ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు.

ఈ ఘటనను బట్టి చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య ఎలాంటి లోపాయికారి సంబంధాలు ఉన్నాయో తెలుస్తోందని జక్కంపూడి రాజా విమర్శించారు. గతంలో చంద్రబాబు, లోకేశ్ నుంచి మొదలుపెడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, పచ్చచొక్కా వేసుకున్న ప్రతీ టీడీపీ కార్యకర్త ఇసుక పేరుతో మాఫియాను నడిపించారు. కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఈ పరిస్థితులు పవన్ కల్యాణ్ కు కనిపించలేదా? ఓ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కు కాపులను బీసీల్లో కలిపే అంశంపై కనీస అవగాహన లేకపోవడం విచిత్రంగా ఉందని అన్నారు. 

More Telugu News