Jagtial District: వానరాల కోసం ఫుడ్‌ కోర్టు...జగిత్యాల కలెక్టర్‌ ప్రయోగం

  • జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో 20 వేల కోతులున్నట్లు అంచనా
  • వాటి కోసం  ప్రత్యేకంగా వనాల అభివృద్ధి
  • వంద బ్లాకుల్లో 18 రకాల పండ్ల మొక్కలు

బతకడానికి ఆహారం అవసరం. అది మనుషులైనా...జంతువులైనా. మనుషులైతే ఆహారం తమకు తాము సమకూర్చుకుంటారు. మరి జంతువులు...ఆహారం లభించక పోతే అవి ఊళ్ల మీద పడతాయి. దొరికింది దొరికినట్టు ఎత్తుకు పోతాయి. ముఖ్యంగా వానరాల విషయంలో ఇది మరింత ఇబ్బంది కరం.

ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని జగిత్యాల జిల్లా కలెక్టర్‌ ‘వానరాల కోసం ఫుడ్‌ కోర్టు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని పట్టణాలు, పల్లెల్లో దాదాపు 20 వేల వానరాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి కోసం వంద బ్లాకుల్లో 20 లక్షల మొక్కలు నాటాలని, అందులో18 రకాల పండ్ల మొక్కలు ఉండాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాలు లేని సమయంలో ఉపాధి కూలీలతో మొక్కలకు నీరందించాలని సూచించారు.

కాగా, తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఈ ఫుడ్‌ కోర్టును నిన్న సందర్శించి కలెక్టర్‌ చొరవను అభినందించారు. భవిష్యత్తులో జగిత్యాల జిల్లా రాష్ట్రానికే ఆదర్శం కానుందని ఆకాంక్షించారు.

More Telugu News