Tirumala: భక్తులతో కిక్కిరిసిన తిరుమల గిరులు!

  • శనివారం నుంచి కొనసాగుతున్న రద్దీ
  • సర్వదర్శనానికి 12 గంటల సమయం
  • భక్తులకు అన్న పానీయాలు అందిస్తున్న టీటీడీ

దేవదేవుడు కొలువైన తిరుమల గిరులు భక్త జనులతో కిటకిటలాడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి పెరిగిన రద్దీ, నేడు కూడా కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు అన్నీ భక్తులతో నిండిపోగా, క్యూలైన్లు వెలుపలకి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.

టైమ్ స్లాట్ టోకెన్, నడక దారి భక్తుల దివ్య దర్శనం, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని, కంపార్టుమెంట్లలోని భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్న పానీయాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా, సోమవారం నాటి ఆర్జితసేవలకు సంబంధించి విజయా బ్యాంకులో 50 సుప్రభాతం, 80 కల్యాణోత్సవం, 125 విశేషపూజ టికెట్లను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. శనివారం నాడు 85 వేల మందికిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

More Telugu News