Tollywood: అడివి శేష్ కోసం జపాన్ నుంచి వచ్చిన యువతి!

  • జపాన్ లో తెలుగు చిత్రాలకు పెరుగుతున్న క్రేజ్
  • 'బాహుబలి'తో జపాన్ ప్రేక్షకుల్ని సమ్మోహితుల్ని చేసిన ప్రభాస్
  • అడివి శేష్ 'ఎవరు' చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న జపనీయులు

పెరుగుతున్న సినిమా బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని చిత్ర నిర్మాతలు కొత్త మార్కెట్ల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ మార్కెట్ మనవాళ్లకు కల్పతరువులా కనిపిస్తోంది. అక్కడ విడుదలవుతున్న తెలుగు చిత్రాలకు భారీ కలెక్షన్లు వస్తున్నాయి. అంతేకాదు, జపాన్ యువత తెలుగు హీరోలంటే విపరీతమైన మోజు ప్రదర్శిస్తోంది. 'బాహుబలి' చిత్రం జపాన్ లో రిలీజవగా, హీరో ప్రభాస్ ను ఓ అద్భుతంగా కళ్లప్పగించి చూశారు. ఇటీవల కాలంలో ప్రభాస్ కోసం జపాన్ నుంచి మహిళాభిమానులు హైదరాబాద్ రావడం, ప్రభాస్ ఇంటి గేటు ముందు నిలబడి సెల్ఫీలు తీసుకుని జన్మ తరించిందన్న ఫీలింగ్ తో  జపాన్ తిరిగివెళ్లడం తరచుగా జరుగుతోంది. అడివి శేష్ కూడా ఈ కోవలోకే చేరాడు.

శేష్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఎవరు' జపాన్ లో కూడా విడుదలైంది. ఈ సినిమా అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రీనా మట్సుయి అనే ఓ అమ్మాయి టోక్యోలో ఈ సినిమా చూడడమే కాదు, హైదరాబాద్ లో కూడా ఈ సినిమా చూడాలని ఇండియా వచ్చేసింది. ఈ విషయం అడివి శేష్ కు తెలియడంతో రీనాకు అపాయింట్ మెంట్ ఇచ్చాడు. ఆ జపాన్ యువతి తన అభిమాన హీరోను చూడగానే భావోద్వేగాలు పట్టలేకపోయింది. అడవి శేష్ ను గట్టిగా హత్తుకుని కన్నీటి పర్యంతమైంది. ఆమె అభిమానం చూసి శేష్ కూడా కదిలిపోయారు. తనే స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

More Telugu News