BJP: అందుకే మన స్వాతంత్ర్య సమరయోధులు జాతీయ భాషగా హిందీ ఉండాలని కోరుకున్నారు: హోంమంత్రి అమిత్ షా

  • దేశంలో ఒకే భాష ఉండాలని వ్యాఖ్య
  • అప్పుడే భారత్ ఐక్యంగా ఉంటుందని వెల్లడి
  • హిందీ దినోత్సవం సందర్భంగా వివాదానికి ఆజ్యం
  • మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు దేశ ప్రజలకు హిందీ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షా చేసిన వ్యాఖ్యలు తమిళనాడుతో పాటు దేశమంతటా హిందీ వ్యతిరేకతను రాజేశాయి. పలువురు రాజకీయ నేతలు షా వ్యాఖ్యలపై అంతెత్తున మండిపడ్డారు. ఈ రోజు హిందీ దినోత్సవం సందర్భంగా షా స్పందిస్తూ..‘భిన్నభాషలు, యాసలు ఉండటం మనదేశపు బలం. కానీ మనదేశంలో ఒకే భాష ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే విదేశీ భాషలకు చోటుండదు. అందుకే మన స్వాతంత్ర్య సమరయోధులు జాతీయ భాషగా హిందీ ఉండాలని కోరుకున్నారు’ అని ట్వీట్ చేశారు.

ప్రపంచానికి భారత్ తరఫున హిందీ ప్రాతినిధ్యం వహిస్తుందని షా అన్నారు. హిందీ వల్లే దేశం ఐక్యంగా ఉంటుందని షా అభిప్రాయపడ్డారు. కాబట్టి భారతీయులంతా మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కలలను నిజం చేసేందుకు హిందీ భాష వాడకాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. దీంతో షా వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు, నెటిజన్లు, ముఖ్యంగా తమిళనాడు రాజకీయ పార్టీలు అంతెత్తున ఎగిరిపడ్డాయి. హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు మరోసారి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి.

More Telugu News