USA: అమెరికాలో గర్జించిన తుపాకీ.. ఒకరి దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు!

  • వాషింగ్టన్ లోని సియాటెల్ లో ఘటన
  • రైల్వేస్టేషన్ లో ఓ దుండగుడి కాల్పులు
  • ఘటన అనంతరం పరారైన నిందితుడు

అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరం రైల్వే స్టేషన్ లో ఓ దుండగుడు ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9.20 నిమిషాలకు స్టేషన్ లోకి వచ్చిన ఆగంతుకుడు.. తన తుపాకీ తీసి కాల్చడం మొదలుపెట్టాడు. బుల్లెట్లు అయిపోగానే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద విషయం తెలుసుకున్న అత్యవసర సేవల సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ నిందితుడు నల్లటి మాస్క్ ధరించి ఉన్నాడని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. కాగా, క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.

More Telugu News