Jagan: జగన్ పాలనను జాతీయ మీడియా ఎండగడుతోంది: దేవినేని ఉమ

  • వంద రోజుల్లో ఏం చేశారో కూడా చెప్పుకోలేని స్థితిలో సీఎం ఉన్నారు
  • మూడు నెలలుగా రివర్స్ పాలన నడుస్తోంది
  • ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు ఆపారో మంత్రులు చెప్పాలి

వంద రోజుల పాలనలో ఏం చేశారో కూడా చెప్పుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. గత మూడు నెలలుగా రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోందని విమర్శించారు. వేల కోట్ల ఉపాధి హామీ నిధులు వస్తే ట్రెజరీలో పెట్టుకున్నారని మండిపడ్డారు. నన్నపనేని రాజకుమారి, అచ్చెన్నాయుడులపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. రాజధాని అభివృద్ధిని దెబ్బతీశారని దుయ్యబట్టారు. జగన్ పాలనను జాతీయ మీడియా ఎండగట్టిందని చెప్పారు.

వాస్తవాలను ప్రసారం చేస్తున్న ఛానళ్లను నిలిపివేస్తున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు. ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు ఆపారో మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఎస్వోలపై ఒత్తిడి చేసి ఛానళ్ల ప్రసారాలను ఆపేస్తారా? అని అడిగారు. ఈ ఛానళ్ల ప్రసారాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రసారాలను పునరుద్ధరించేంత వరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. మీడియా స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

More Telugu News