parlment stayee sanghalu: పార్లమెంటరీ స్థాయీ సంఘాల ఛైర్మన్‌లుగా టి.జి.వెంకటేశ్, కేశవరావు, విజయసాయిరెడ్డి

  • తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ నేతలకు పదవులు
  • అన్ని శాఖలకు ఛైర్మన్లను ప్రకటించిన లోక్‌సభ స్పీకర్‌
  • హోం వ్యవహారాల శాఖ బాధ్యతలు కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మకు

పార్లమెంటరీ స్థాయీ సంఘాలను నియమిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా ప్రకటించిన ఛైర్మన్ల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురికి చోటు దక్కింది. బీజేపీ ఎంపీ టి.జి.వెంకటేశ్‌ను రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖకు, టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావును పరిశ్రమల శాఖకు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని వాణిజ్య వ్యవహారాల శాఖ స్థాయీ సంఘాల ఛైర్మన్‌లుగా నియమించినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది.

 అలాగే ఆయా సంఘాల్లో నియమితులైన సభ్యుల వివరాలను ప్రకటించింది. కీలకమైన హోం వ్యవహారాల స్థాయీ సంఘం ఛైర్మన్‌గా కాంగ్రెస్‌ నేత ఆనంద్‌శర్మ నియమితులయ్యారు. గతంలో చిదంబరం ఈ విభాగం ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఇంకా పెట్రోలియం శాఖకు బీజేపీ ఎంపీ రమేష్‌ బిధురి, ఐటీ శాఖకు కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌, రక్షణ శాఖకు బీజేపీ నేత జోయల్‌ ఓరం, విదేశీ వ్యవహారాల శాఖకు బీజేపీ నేత పి.పి.చౌదరి, రైల్వే శాఖకు రాధామోహన్‌సింగ్‌, ఎరువులు, రసాయనాల శాఖ స్థాయీ సంఘం ఛైర్మన్‌గా డీఎంకే ఎంపీ కనిమొళిని నియమించారు. కాగా, విదేశీ వ్యవహారాల స్థాయీ సంఘంలో చిదంబరం, ఎరువులు, రసాయనాల స్థాయీ సంఘంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, అభిషేక్‌మను సింఘ్విలు సభ్యులుగా ఉన్నారు.

More Telugu News