drunk man: మద్యం మత్తులో మెట్రో రైలులో చిందేసిన ప్రయాణికుడు!

  • మందుకొట్టి రైలెక్కిన ప్రయాణికుడు
  • సెల్ఫీలు తీస్తూ, ఇతరుల ఫొటోలు తీస్తూ నానా హంగామా
  • పరిమితంగానే మద్యం తాగాడన్న మెట్రో రైల్ ఎండీ

మందుకొట్టి హైదరాబాద్‌లో మెట్రో రైలెక్కిన ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. పట్టుకోల్పోయి నిల్చునేందుకు నానా తంటాలు పడ్డాడు. ఇక నిల్చోవడం తన వల్ల కాదని గ్రహించి డ్యాన్స్‌ చేస్తూ నానా రభస చేశాడు. సెల్ఫీలు తీసుకోవడమే కాక.. తోటి ప్రయాణికుల ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. చివరికి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మార్గమధ్యంలో తార్నాక స్టేషన్‌లో దిగిపోయాడు. ఈ నెల 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఇటువంటి సమయాల్లో ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. రైలులో హల్‌చల్ చేసిన వ్యక్తి మద్యం ఎక్కువగా తాగలేదని, తోటి ప్రయాణికులను ఆకర్షించేందుకే అలా ప్రవర్తించాడని వివరణ ఇచ్చారు. డ్రంకెన్ డ్రైవ్ నిషేధం నేపథ్యంలో పరిమితంగా మద్యం తాగిన వారిని మెట్రోలో అనుమతించాలన్న అభ్యర్థనలు ఉన్నాయని ఆయన తెలిపారు.

More Telugu News