Delhi: సరి, బేసి విధానం అవసరం లేదు.. కొత్త రింగురోడ్డుతో సమస్య తగ్గింది: నితిన్ గడ్కరీ

  • ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు సరి, బేసి విధానం
  • నవంబర్ 4 నుంచి అమలు చేయనున్న కేజ్రీవాల్ ప్రభుత్వం
  • రింగ్ రోడ్డుతో కాలుష్యం తగ్గిందన్న నితిన్ గడ్కరీ

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో... రోడ్లపై వాహనాలను నియంత్రించేందుకు సరి, బేసి విధానాన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి అమల్లోకి తీసుకురానుంది. నవంబర్ 4 నుంచి 15వ తేదీ వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇప్పుడు మరోసారి ఆ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని... కొత్తగా నిర్మించిన రింగు రోడ్డు వల్ల కాలుష్యం చాలా మటుకు తగ్గిందని చెప్పారు. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రానున్న రెండేళ్లలో పలు కార్యక్రమాలను చేపట్టనుందని తెలిపారు.

సరి,బేసి విధానం ప్రకారం నవంబర్ 4, 6, 8, 10, 12, 14 తేదీల్లో కేవలం సరి సంఖ్య రిజిస్ట్రేషన్ నంబర్ గా ఉన్న వాహనాలు మాత్రమే రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. ఇతర రోజుల్లో కేవలం బేసి సంఖ్య కలిగిన వాహనాలు మాత్రమే రోడ్లపైకి రావాలి.

More Telugu News