Ijaz Ahmed Shah: ఉగ్రవాద సంస్థలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం: పాక్ మంత్రి ఇజాజ్ షా

  • జమాత్ ఉద్ దవా లాంటి సంస్థలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం
  • వాటిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సి ఉంది
  • పాక్ జాతీయ టీవీలో ఇజాజ్ షా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ను పాలించిన నేతలు దేశాన్ని సర్వనాశనం చేశారంటూ ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి ఇజాజ్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అత్యున్నత శాఖను నిర్వహిస్తున్న ఇజాజ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో పాక్ ప్రభుత్వం షాక్ కు గురైంది. పాకిస్థాన్ జాతీయ టీవీతో మాట్లాడుతూ ఆయన మరో బాంబు పేల్చారు. హఫీజ్ సయీద్ (ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్)కి చెందిన జమాత్ ఉద్ దవా లాంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు కోట్లాది రూపాయలను ఖర్చు చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్థలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

పాకిస్థాన్ లో ఇజాజ్ కు బలమైన నేతగా గుర్తింపు ఉంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటు మిలిటరీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్మీలో ఆయన బ్రిగేడియర్ గా పని చేశారు. అయితే, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పాక్ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్నాయి. పాక్ చెబుతున్న మాటలను అంతర్జాతీయ సమాజం నమ్మడం లేదని, భారత్ నే నమ్ముతోందని కూడా ఆయన ఇటీవల అన్నారు.

More Telugu News