Jagan: పీవీ సింధుకు విశాఖలో 5 ఎకరాలు ఇచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంగీకారం

  • తల్లిదండ్రులతో కలసి జగన్ ను కలిసిన పీవీ సింధు
  • వరల్డ్ ఛాంపియన్ ను సత్కరించిన జగన్
  • మరిన్ని విజయాలను సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన సీఎం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు కలుసుకుంది. తన తల్లిదండ్రులతో కలసి అమరావతిలోని సచివాలయానికి వచ్చిన పీవీ సింధు... ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించిన సింధును శాలువా కప్పి జగన్ సత్కరించారు. ఆమెకు అభినందనలను తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు కూడా ఈ సందర్భంగా అక్కడ ఉన్నారు.

సమావేశానంతరం పీవీ సింధు మాట్లాడుతూ, వైజాగ్ లో అకాడమీ నెలకొల్పేందుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని తెలిపింది. అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించింది. పద్మభూషణ్ పురస్కారానికి తన పేరును పరిశీలిస్తుండటం గర్వంగా ఉందని తెలిపింది. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సింధు గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు సాధించింది.

More Telugu News