Krishna River: శ్రీశైలం ప్రాజెక్టుకు మరింతగా పెరిగిన వరద!

  • ఇన్ ఫ్లో 3,06,582 క్యూసెక్కులు
  • 2.80 లక్షల క్యూసెక్కులు సాగర్ కు
  • ప్రకాశం బ్యారేజ్ దిగువన అప్రమత్తం

కృష్ణానదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, భీమ జలాశయాలకు వస్తున్న వరదను వస్తున్నట్టు దిగువకు వదులుతూ ఉండటంతో శ్రీశైలం ప్రాజెక్టు వద్ద గంటగంటకూ వరద పెరుగుతోంది. ఈ ఉదయం జలాశయంలోకి 3,06,582 క్యూసెక్కుల వరద వస్తుండగా, ఔట్ ఫ్లో 3, 28,634 క్యూసెక్కులుగా ఉంది. ఇందులో 2.80 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు క్రస్ట్ గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కు చేరుతోంది. రిజర్వాయర్ మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 214.3627 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంతకుమించి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని అధికారులు అంటున్నారు.

ఇక శ్రీశైలం నుంచి వస్తున్న వరదను వచ్చినట్టు సాగర్ నుంచి దిగువకు వదులుతూ ఉండటంతో, ప్రకాశం బ్యారేజ్ వద్ద అన్ని గేట్లనూ అధికారులు ఎత్తివేశారు. దిగువ ప్రాంతాల ప్రజలను మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేటి సాయంత్రానికి శ్రీశైలానికి వచ్చే వరద నాలుగు లక్షల క్యూసెక్కులను దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

More Telugu News