Siddipet District: మామకు అంత్యక్రియలు నిర్వహిస్తూ అల్లుడి మృతి... సిద్ధిపేట జిల్లాలో హృదయ విదారక ఘటన!

  • సింగరేణిలో పనిచేసిన నారాయణ
  • అనారోగ్యంతో కన్నుమూత
  • చితి చుట్టూ తిరుగుతూ గుండెపోటుకు గురైన వైనం 

పిల్లనిచ్చిన మామ, ఆపై ఎప్పుడు ఏమిస్తాడా అని వేచిచూసే అల్లుళ్లే, ఎక్కువగా కనిపించే ఈ కాలంలో, మామలో తండ్రిని చూసుకున్న ఓ అల్లుడు, ఆయన చనిపోవడాన్ని జీర్ణించుకోలేక, తానూ ప్రాణాలు చాలించాడు. ఈ ఘటనతో ఓ ఇల్లాలు, అటు తండ్రిని, ఇటు భర్తను ఒకేసారి కోల్పోయి గుండెలవిసేలా విలపిస్తోంది. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా బద్దిపడగలో జరిగింది.

 వివరాల్లోకి వెళితే, సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన పండుగ నారాయణ (65) అనే వ్యక్తి, సిద్ధిపేటలో నివాసం ఉంటున్నాడు. తన అల్లుడు శ్రీధర్ (38) కూతురు సుజాతను ఎంతో బాగా చూసుకుంటాడు. ఇక శ్రీధర్ ను ఈయన కూడా కన్న కొడుకులా చూసుకునేవాడు.

ఈ క్రమంలో కొంతకాలం క్రితం అనారోగ్యం బారినపడ్డ నారాయణ, మరణించగా, అంత్యక్రియలను స్వగ్రామంలో నిర్వహించాలన్న తలంపుతో మృతదేహాన్ని బద్దిపడగకు తీసుకువచ్చారు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని తరలిస్తుండగా, శ్రీధర్ కూడా పాడెను మోసాడు. తర్వాత చితి చుట్టూ తిరుగుతూ గుండెపోటుతో కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం సిద్దిపేటకు తరలిస్తుండగానే కన్నుమూశాడు. దీంతో ఆయన భార్య సుజాత, ఇద్దరు కుమార్తెలు కన్నీరు మున్నీరు కాగా, దీనిని చూసినవారు సైతం కంటతడి పెట్టారు.

More Telugu News