Sarpa Dosham: సర్పదోషం పోవాలంటే ఐదు పెళ్లిళ్లు, ఐదు శోభనాలు... అంటూ మహిళను మోసం చేయబోయిన తండ్రీకొడుకులు కటకటాల వెనక్కి!

  • దోషం ఉందంటూ స్వాములను ఆశ్రయించిన మహిళ
  • పూజలు చేసి, అత్యాచారం చేసేందుకు ప్లాన్ వేసిన తండ్రీ కొడుకులు
  • అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు

"నీకు సర్పదోషం ఉంది. అది పోవాలంటే, ఐదు సార్లు తాళి కట్టించుకుని, ఐదు సార్లు శోభనం చేసుకోవాలి. మాతో లైంగిక చర్యలో పాల్గొనాలి" అంటూ మహిళను టార్గెట్ చేసిన ఓ దొంగ స్వామి, అతని కుమారుడు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. కర్ణాటకలోని బసవసెంకరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కామస్వామి గణేశ్ అనే వ్యక్తి, పూజలు, శాంతులు చేయిస్తుంటాడు. అతనికి కుమారుడు మణికంఠ సాయం చేస్తుంటాడు.

వీరి వద్దకు భర్తకు దూరంగా ఉంటూ, ప్రైవేటు కంపెనీలో పని చేసుకుంటూ కాలం గడుపుతున్న ఓ మహిళ వచ్చింది. తనకు సర్పదోషం ఉందని ఆమె చెప్పడంతో, దాన్ని తొలగిస్తామని నమ్మబలికిన వీరు, ఈ నెల 7న ఆమె ఇంట్లో పూజలు చేశారు. పూజ తరువాత ఆ వస్తువులను మూటగట్టి ఇచ్చారు. ఈ మూటను కుక్కే సుబ్రమణ్యలో వదిలేయాలని చెప్పారు. ఐదు సార్లు తాళి కట్టించుకుని, తమతోనే ఐదుసార్లు కలిస్తే, దోషం మొత్తం పూర్తవుతుందని చెప్పారు.

ఆపై తమ కామవాంఛలు తీర్చుకునేందుకు కుక్కే సుబ్రమణ్యలో రెండు గదులను బుక్ చేసుకున్నారు. అయితే, బాధితురాలి వైఖరిని, ఆమె చేయాలనుకుంటున్న పనిని గమనించిన కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కామస్వామి గణేశ్, మణికంఠలను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని కటకటాల వెనక్కు తరలించారు. వారిద్దరూ చెప్పిన మాటలను తాను నమ్మానని, తన కాపురం నిలబడుతుందని చెబితే, రూ. 40 వేలు కూడా ఇచ్చేందుకు సిద్ధపడ్డానని బాధితురాలు ఫిర్యాదు చేయడం గమనార్హం.

More Telugu News