Guntur District: గుంటూరు జిల్లాలో దారుణం.. భర్తను హత్యచేసి చెత్తకుప్పలో పూడ్చిపెట్టిన భార్య!

  • ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయిన ఆంజనేయులు
  • మృతుడి తమ్ముడు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి 
  • వివాహేతర సంబంధమే కారణమని అనుమానం

భర్తను హత్య చేసిన భార్య అతడి మృతదేహాన్ని చెత్తకుప్పలో పూడ్చిపెట్టింది. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వెల్దుర్తి మండలంలోని పట్లవీడుకు చెందిన దొడ్డక ఆంజనేయులు (55), ఆదిలక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం క్రితం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో ఆదిలక్ష్మి తన ఇద్దరు పిల్లలను తీసుకుని మాచర్ల వెళ్లిపోయి అక్కడే ఉంటోంది.

ఈ నెల 5న భార్య వద్దకు వచ్చిన ఆంజనేయులు ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. అన్న కనిపించకపోవడంతో అతడి తమ్ముడు అప్పారావు.. వదిన ఆదిలక్ష్మి వద్దకు వచ్చి, తన అన్నయ్య కనిపించడం లేదని, ఎక్కడికెళ్లాడని ఆమెను ప్రశ్నించాడు. ఎక్కడికెళ్లాడో తనకు తెలియదని ఆదిలక్ష్మి చెప్పింది. దీంతో, పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతానంటూ అప్పారావు చెప్పాడు.

దీంతో భయపడిన ఆదిలక్ష్మి అసలు విషయాన్ని బయటపెట్టింది. భర్తను చంపి డంపింగ్ యార్డులో పూడ్చిపెట్టినట్టు చెప్పింది. అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూడ్చిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదిలక్ష్మిని అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి పంపారు. ఆంజనేయులు హత్యకు వివాహేతర సంబంధమే కారణం కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

More Telugu News