Andhra Pradesh: అమరావతి నిర్మాణం ఇష్టం లేదని బుగ్గన చెప్పాల్సింది!: టీడీపీ నేత నారా లోకేశ్ చురకలు

  • అమరావతి నిర్మాణానికి డబ్బులు లేవన్న బుగ్గన
  • ఏపీ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పపట్టిన నారా లోకేశ్
  • ఇప్పుడే నిధులొద్దని జగన్ మోదీకి చెప్పారని ఆరోపణ

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు లేవని  ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ మంత్రి వ్యాఖ్యలపై తెలుగుదేశం నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా తెలుగుదేశం నేత నారా లోకేశ్ బుగ్గన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. అమరావతికి నిధులు లేవని భారత్-సింగపూర్ వ్యాపార, ఆవిష్కరణల సదస్సు వేదికగా బుగ్గన చెప్పడం సిగ్గుచేటని లోకేశ్ విమర్శించారు.

దానికి బదులుగా ‘అమరావతి నిర్మాణం మాకు ఇష్టం లేదు అని చెప్పాల్సిందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లిన సీఎం జగన్ రాజధాని నిర్మాణానికి ఇప్పుడే నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పివచ్చారని లోకేశ్ ఆరోపించారు. ఈ విషయం బుగ్గనగారికి గుర్తులేదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన లోకేశ్.. బుగ్గన వ్యాఖ్యలపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని జతచేశారు.

More Telugu News