Marriage: లవర్ తో కుమార్తెకు పెళ్లి చేయాలని చూసిన తల్లి... అసలు విషయం తెలిసి చేష్టలుడిగిన పోలీసులు!

  • ఓ యువకుడితో తల్లి వివాహేతర బంధం
  • అతనితో కుమార్తెకు పెళ్లి చేయాలని ఆలోచన
  • వివాహ మండపం వద్ద హై డ్రామా

తన కుమార్తె ప్రేమించిన యువకుడితో వివాహం జరిపించేందుకు నిర్ణయించిందో తల్లి. అయితే, ఆమె మాస్టర్ ప్లాన్ ను తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యూరు సమీపంలో కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, 19 సంవత్సరాల ఓ యువతి, ఎస్పీ కార్యాలయానికి వచ్చి, తన ప్రాంతానికి చెందిన వ్యక్తి, తనను ప్రేమించి మోసం చేశాడని, ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని ఫిర్యాదు చేసింది. ఆ పెళ్లిని అడ్డుకుని, తనకు న్యాయం జరిపించాలని ఆమె వేడుకోగా, ఈ ఫిర్యాదును తిరువయ్యూరు మహిళా పోలీస్ స్టేషన్ కు ఎస్పీ ఫార్వార్డ్ చేశారు.

మహిళా పోలీసులు సదరు యువతితో పాటు ఆమె తల్లిని కూడా విచారణకు పిలిచారు. తన కుమార్తె ప్రేమించిన వాడితో పెళ్లికి తనకు అభ్యంతరం లేదని తల్లి పేర్కొంది. ఈలోగా తనకు అతనితో పెళ్లి జరిపించాల్సిందేనంటూ, కూతురు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోబోయింది. ఆమెను బలవంతంగా అడ్డుకున్న పోలీసులు, మందలించిఆ తర్వాత, సదరు యువకుడ్ని పిలిచి, ప్రశ్నించారు.

అప్పుడు అసలు విషయం బయట పడింది. తాను ఆ యువతిని ప్రేమించలేదని, కానీ, ఆమె తల్లితో తనకు సంబంధం ఉందని అతను చెప్పడంతో పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆపై యువతి తల్లిని నిలదీయగా, విషయం ఒప్పుకుంది. కుమార్తెతో అతనికి వివాహం జరిపిస్తే, తనకు అడ్డుండదన్న ఆలోచనతోనే పెళ్లికి ఒప్పుకున్నట్టు చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న యువతి, తన ఫిర్యాదును వెనక్కు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోగా, మహిళా పోలీసులు ఆమె తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఆపై సదరు యువకుడి వివాహం నేడు యథావిధిగా మరో యువతితో జరిగేందుకు ఏర్పాట్లు జరిగిపోయాయి.

More Telugu News