Hyderabad: రేపు వినాయక నిమజ్జనాలు.. హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షల విధింపు!

  • రేపు బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు శోభాయాత్ర
  • 17 ప్రధాన రహదారుల్లో ఈ యాత్ర ఉంటుంది
  • రేపు ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు: అడిషనల్ సీపీ అనిల్ కుమార్

హైదరాబాదులో రేపు వినాయక నిమజ్జనాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అడిషనల్ పోలీస్ కమిషనర్ అనిల్ కుమార్ స్పష్టం  చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు 18 కిలో మీటర్ల మేరకు శోభాయాత్ర నిర్వహిస్తున్నారని చెప్పారు. 17 ప్రధాన రహదారుల్లో ఈ యాత్ర ఉంటుందని అన్నారు.

అలియాబాద్, నాగుల చింట, చార్మినార్, మదీనా, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్ బాగ్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభాయాత్ర జరుగుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్ వాహనాలకు శోభాయాత్రలో అనుమతించమని, ప్రతి ఒక్కరూ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.

 పది పార్కింగ్ స్థలాల ఏర్పాటు 

వినాయక నిమజ్జనాలను తిలకించేందుకు వచ్చే వారు తమ వాహనాలను పార్కింగ్ చేసే నిమిత్తం పది పార్కింగ్ ప్లేస్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఖైరతాబాద్ జంక్షన్, ఆనంద్ నగర్ కాలనీ, గోసేవ సదన్, కట్టమైసమ్మ ఆలయం, నిజాం కాలేజ్, ఎంఎంటీఎస్ ఖైరతాబాద్ స్టేషన్, బుద్ధ భవన్ వెనుక, లోయర్ ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్స్ లో పార్కింగ్ కు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

13 గంటల పాటు అమల్లో ట్రాఫిక్ ఆంక్షలు  

రేపు ఉదయం 6 గంటల నుంచి ఆయా మార్గాల్లో ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదని, 13 గంటల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. శంషాబాద్ కు వెళ్లే విమాన ప్రయాణికులు, ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రోడ్లపై కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. 13వ తదీ ఉదయం కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూస్తామని, ఆ రోజున ట్యాంక్ బండ్ పై ఒక వైపే వాహనాలను అనుమతిస్తామని అన్నారు.

More Telugu News