Andhra Pradesh: గుంటూరులో ‘వైసీపీ బాధితుల శిబిరం’ వద్ద ఉద్రిక్తత.. టీడీపీ నేతల అరెస్ట్.. బాధితులు స్వస్థలాలకు తరలింపు!

  • ఆలపాటి రాజా, మద్దాలి, జీవీ ఆంజనేయులు అరెస్ట్
  • వేర్వేరు పీఎస్ లకు తరలింపు
  • గ్రామాలకు తిరిగెళితే తగిన రక్షణ కల్పిస్తామన్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా అరండల్ పేట వద్ద టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ‘వైసీపీ బాధితుల శిబిరం’ వద్ద ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ అడ్డుకున్న పోలీసులు.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ సహా పలువురు ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాధితుల శిబిరానికి చేరుకున్న 50 మంది పోలీసులు టీడీపీ నేతలు మద్దాలి గిరిధర్, ఆలపాటి రాజా, జీవీ ఆంజనేయులను అరెస్ట్ చేశారు. వీరిని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

అలాగే ఈ క్యాంపులో ఉన్న టీడీపీ మద్దతుదారులను తమ స్వగ్రామాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు గ్రామాలకు తిరిగి వెళితే తగిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. చివరికి వీరిని ఆత్మకూరు, పిన్నెల్లి, జింకలపాలెం, చెన్నాయిపాలెంలకు పోలీసులు తరలించారు. మొత్తం ఐదు మార్గాల్లో వీరిని పోలీసులు తరలిస్తున్నారు. అంతకుముందు శిబిరంలోని బాధితుల నుంచి ఆర్డీవో వివరాలను సేకరించారు.

More Telugu News