Jagan: ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చర్యలు చేపట్టండి: జగన్

  • ఇసుక స్టాక్ యార్డ్ పాయింట్లను పెంచండి
  • ఇసుక మాఫియాను అరికట్టడానికి టెక్నాలజీని వాడండి
  • చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను పెట్టండి

విపక్షాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఇసుక విషయంలో ప్రభుత్వంపై రాళ్లు వేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. నూతన ఇసుక విధానంపై సచివాలయంలో ఈరోజు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇసుక స్టాక్ యార్డ్ పాయింట్లను పెంచాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ఇసుక స్టాక్ యార్డులకు చేరేలా చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా లేకుండా చేయడానికి టెక్నాలజీని వాడాలని చెప్పారు. ఏ స్థాయిలో కూడా అవినీతి ఉండకూడదని అన్నారు.

ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలను పెట్టాలని ఆదేశించారు. ఫుటేజీని మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా ఉండాలని అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు రాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడెక్కడ ఇసుక కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలని జగన్ అన్నారు.



More Telugu News