PoK: పీవోకేను భారత్ లో కలపడమే కేంద్ర ప్రభుత్వ తదుపరి లక్ష్యం: జితేంద్ర సింగ్

  • ఇది బీజేపీ వ్యక్తిగత అజెండా కాదు
  • 1994లో ఈ తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదించింది
  • పాక్ నేతల వ్యాఖ్యలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు

పాకిస్థాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగాన్ని వెనక్కి తెచ్చుకోవడమే కేంద్ర ప్రభుత్వ తదుపరి లక్ష్యమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో నిన్న భారత్-పాకిస్థాన్ తమ వాదనలను గట్టిగా వినిపించాయి.

ఇది జరిగిన గంటల వ్యవధిలోనే జితేంద్ర సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్ లో పీవోకేను కలపడమే ఇప్పుడు మన లక్ష్యమని చెప్పారు. ఇది బీజేపీ వ్యక్తిగత అజెండా కాదని... 1994లో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు పీవోకేను భారత్ లో తిరిగి కలపాలనే తీర్మానానికి పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.

జమ్మూకశ్మీర్ లో నిరంతరం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని పాకిస్థాన్ పై మండిపడ్డారు. పాకిస్థాన్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తున్నామని... వారి వ్యాఖ్యలకు ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు మోదీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు.

More Telugu News