Andhra Pradesh: ఎక్కడికక్కడ టీడీపీ నేతల అరెస్ట్.. చంద్రబాబు గృహ నిర్బంధం?

  • చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • గుంటూరు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధింపు
  • పల్నాడులో 30 పోలీస్ యాక్ట్ అమలు

టీడీపీ నేతలు ‘ఛలో ఆత్మకూరు’కు పిలుపునివ్వడంతో గుంటూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును గృహనిర్బంధం చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు, ఉండవల్లి గుహల వద్ద దేవినేని అవినాశ్, చంద్రదండు ప్రకాశ్, గోనుగుంట కోటేశ్వరరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో 144 సెక్షన్ విధించిన పోలీసులు, పల్నాడులో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నారు.

ఇక, చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, గద్దె రామ్మోహన్‌రావు, కృష్ణా జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రకాశం జిల్లాలో శిద్దా రాఘవరావు, అశోక్ రెడ్డి‌లను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కృష్ణా జిల్లాలో టీడీపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేటలో టీడీపీ నేత అరవిందబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి యాదవ్‌లకు నోటీసులు జారీ చేశారు. సత్తెనపల్లిలో మునిసిపల్ మాజీ చైర్మన్ రామస్వామి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పెదకరీముల్లా, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావులతోపాటు మొత్తం 14 మందిని బైండోవర్ చేశారు.

More Telugu News