Visakhapatnam District: ప్రియుడితో కలిసి భర్త హత్య.. 23 రోజుల తర్వాత వెలుగులోకి

  • వివాహేతర సంబంధంతో భర్తను హతమార్చిన భార్య
  • ఆత్మహత్యగా చిత్రీకరించిన వైనం
  • భర్తకు రావాల్సిన డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో అనుమానం

వివాహితకు ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసిన భర్త నిలదీయడంతో అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలో అతడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. అయితే, 23 రోజుల తర్వాత విషయం వెలుగులోకి రావడంతో వివాహితను, ప్రియుడిని, వారికి సహకరించిన మరో యువకుడిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. విశాఖపట్టణంలోని మద్దిలపాలెంలో జరిగిందీ ఘటన.

పోలీసుల కథనం ప్రకారం..  మద్దిలపాలేనికి చెందిన దల్లి జ్యోతి (26)-సతీశ్ కుమార్ భార్యాభర్తలు. సతీశ్ సైన్యంలో హవల్దార్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 19న పోలీసులకు ఫోన్ చేసిన జ్యోతి తన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. సతీశ్ కుటుంబ సభ్యులు కూడా జ్యోతిపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

తాజాగా,  జ్యోతి సైనికాధికారులను కలిసి తన భర్తకు రావాల్సిన నగదు మొత్తాలపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు జ్యోతిని మరోమారు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సిమ్మా భరత్ కుమార్ (24) అనే యువకుడితో 9 నెలల క్రితం జ్యోతికి పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చిన భర్త సతీశ్ కుమార్‌కు విషయం తెలిసి భార్యను హెచ్చరించాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.

గత నెల 18న భర్త తాగుతున్న మద్యంలో నిద్రమాత్రలు కలిపేసింది. దీంతో మద్యం తాగిన అనంతరం సతీశ్ మత్తులోకి జారుకున్నాడు. ప్లాన్‌లో భాగంగా ముందుగానే అక్కడికి చేరుకున్న ప్రియుడు భరత్, కొత్తరేసపువానిపాలేనికి చెందిన గొడ్ల భాస్కర్ (22)లు ఇంట్లోకి చొరబడి చున్నీతో సతీశ్‌ మెడకు ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా నమ్మించారు. నిందితురాలు జ్యోతి అసలు విషయం వెల్లడించడంతో నిందితులు ముగ్గురికీ పోలీసులు అరదండాలు వేసి జైలుకు పంపారు.

More Telugu News