Rajaiah: కేసీఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా నేను మాట్లాడలేదు: రాజయ్య

  • ఎవరికీ ఇవ్వని గౌరవాన్ని కేసీఆర్ నాకు ఇచ్చారు
  • నేను నాలుగోసారి గెలవడానికి కేసీఆర్, కేటీఆర్ కారణం
  • నేను జీవితాంతం టీఆర్ఎస్ లోనే ఉంటా

కేసీఆర్, కేటీఆర్ లకు వ్యతిరేకంగా తాను మాట్లాడాననే ప్రచారంలో నిజం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరికీ ఇవ్వని గౌరవాన్ని కేసీఆర్ తనకు ఇచ్చారని అన్నారు. డిప్యూటీ సీఎం పదవి పోయినా ప్రభుత్వంలో తనను అనేక రకాలుగా ప్రోత్సహించారని తెలిపారు.

గత ఎన్నికల్లో తనను ఓడించేందుకు కొందరు ప్రయత్నించారని... కానీ కేసీఆర్, కేటీఆర్ తనను ప్రోత్సహించి ఎమ్మెల్యేగా గెలిపించారని... తాను నాలుగోసారి గెలుపొందటానికి వారే కారణమని చెప్పారు. తన స్థాయికి తగిన పదవిని ఇస్తానని తనకు కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. జీవితాంతం తాను టీఆర్ఎస్ లోనే ఉంటానని, వారు ఏ బాధ్యత అప్పగిస్తే అది నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

More Telugu News