Pawan Kalyan: పవన్ సిగ్గుపడిన క్షణాలను అందరితో పంచుకున్న సమంత!

  • అత్తారింటికి దారేది చిత్రంలో జంటగా నటించిన పవన్, సమంత
  • స్విట్జర్లాండ్ లో జనాన్ని చూసి పవన్ దూరంగా వెళ్లిపోయాడన్న సమంత
  • త్రివిక్రమ్ వెళ్లి కాన్ఫిడెన్స్ నింపాడని వెల్లడి

పవన్ కల్యాణ్, సమంత జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశాన్ని హీరోయిన్ సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పవన్ కల్యాణ్ కు సిగ్గు ఎక్కువని, జనం మధ్యలో షూటింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందిపడతారని వివరించింది. ముఖ్యంగా ఆయనకు ఎక్కువ మందిలో పాటల షూటింగ్ అంటే ఎక్కడలేని సిగ్గు వచ్చేస్తుందని, అత్తారింటికి దారేది చిత్రం సందర్భంగా స్విట్జర్లాండ్ షెడ్యూల్ లో ఆయన సిగ్గు చూసి తాను నవ్వాపుకోలేకపోయానని సమంత చెప్పింది.

అక్కడి అందమైన లొకేషన్లలో ఓ పాట షూట్ చేస్తుండగా, చాలామంది జనం వచ్చారని, వాళ్లను చూసిన పవన్ తాను స్టెప్పులు వేయలేనంటూ కారవాన్ వద్దకు వెళ్లిపోయారని వెల్లడించింది. అయితే, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వెళ్లి "పవన్ నువ్వు చేయగలవు!" అని కాన్ఫిడెన్స్ నింపడం, "నేను చేయగలనంటావా!" అంటూ పవన్ బెరుకుగా మాట్లాడ్డం చూసి నవ్వుకున్నానని తెలిపింది. పవన్ పవర్ స్టార్ అయినా ఎంతో సాధారణ మనస్తత్వం ఉన్న వ్యక్తి అనిపించిందని, ఆ మనస్తత్వమే పవన్ లో తనకు బాగా ఇష్టమైన అంశమని సమంత వివరించింది.

More Telugu News