Chandrababu: నేడు ఉండవల్లిలోని ఇంటికి చంద్రబాబు!

  • మూడు వారాలుగా హైదరాబాద్ లోనే..
  • పార్టీ ముఖ్య నేతలతో నేడు సమావేశం
  • పార్టీ న్యాయ విభాగ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా హాజరు 

గత మూడు వారాలుగా హైదరాబాద్ లోనే ఉండి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నేడు అమరావతిలోని తన నివాసానికి వెళ్లనున్నారు. ఉండవల్లిలో ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ ను తన నివాసంగా చేసుకున్న ఆయన, గత నెలలో కృష్ణానదికి వరదలు రావడానికి ముందు, హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై, ఆయన విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో పర్యటించినా, ఇంటికి మాత్రం వెళ్లలేదు.

కాగా, నేడు ఆయన తన ఇంటికి చేరుకుని పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. పల్నాడు ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష జరపనున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఆపై 'చలో ఆత్మకూరు'పైనా చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకుంటారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని ఇప్పటికే డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. నేడు తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగ సమావేశం జరుగనుండగా, చంద్రబాబు చీఫ్ గెస్ట్ గా పాల్గొని ప్రసంగించనున్నారు.

More Telugu News