Kerala: అడవి దారిలో వేగంగా వెళ్తున్న జీపు నుంచి కిందపడిన ఏడాది చిన్నారి.. పట్టించుకోకుండా వెళ్లిన తల్లిదండ్రులు

  • రాత్రివేళ రోడ్డుపై పాకుతున్న చిన్నారిని గుర్తించిన వాహనదారులు
  • రక్షించిన అటవీశాఖ అధికారులు
  • తల్లిదండ్రులకు అప్పగింత

వేగంగా వెళ్తున్న వాహనం నుంచి ఏడాది వయసున్న చిన్నారి కిందపడింది. ఆ విషయాన్ని గమనించని తల్లిదండ్రులు అలానే వెళ్లిపోయారు. కేరళలోని ఇడుక్కి జిల్లా మున్నార్ పర్యాటక ప్రాంతంలో జరిగిందీ ఘటన. రాత్రివేళ వేగంగా వెళ్తున్న ఓ ఎస్‌యూవీ నుంచి చిన్నారి కిందపడడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అయితే, పాప ఎలా కిందపడిందన్నది మిస్టరీగా మారింది. కిందపడిన చిన్నారి రోడ్డుపై అటూఇటూ పాకుతూ కనిపించింది. అంత వేగంలో కిందపడినా చిన్నారికి ఏమీ కాకపోవడం గమనార్హం.

ఆ దారి గుండా ప్రయాణించిన కొందరు వాహనదారులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వెతికారు. చిన్నారి కనిపించకపోవడంతో సీసీటీవీ కెమెరాలను పరిశీలించి రోడ్డుపక్కన ఉన్నట్టు గుర్తించి రక్షించారు. వెంటనే సమీపంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. మరోవైపు, కాసేపటికే ఏడాది వయసున్న తమ కుమార్తె కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆ చిన్నారిని అధికారులు వారికి అప్పగించారు.

More Telugu News