Sri Lanka: పాకిస్థాన్ టూర్ కి వెళ్లకూడదని నిర్ణయించుకున్న శ్రీలంక క్రికెటర్లు

  • 10 మంది ఆటగాళ్లు పర్యటనకు దూరం
  • పాకిస్థాన్ వెళ్లకూడదని నిర్ణయించుకున్న టి20 కెప్టెన్ లసిత్ మలింగ
  • 2009లో లాహోర్ లో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి

పాకిస్థాన్ లో పరిస్థితులను కారణంగా చూపుతూ 10 మంది శ్రీలంక క్రికెటర్లు టూర్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబరు 27 నుంచి శ్రీలంక జట్టు పాకిస్థాన్ గడ్డపై 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్ లు ఆడాల్సివుంది. కానీ, శ్రీలంక టి20 జట్టు కెప్టెన్ లసిత్ మలింగ సహా 10 మంది ఆటగాళ్లు పాకిస్థాన్ వెళ్లకూడదని నిశ్చయించుకున్నట్టు శ్రీలంక క్రికెట్ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ వెళ్లాలా? వద్దా? అనేది తాము ఆటగాళ్లకే వదిలేశామని శ్రీలంక క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.

ఏంజెలో మాథ్యూస్, తిసర పెరెరా, నిరోషన్ డిక్వెలా, కుశాల్ పెరెరా, ధనంజయ డిసిల్లా, అఖిల ధనంజయ, సురంగ లక్మల్, దినేశ్ చాందిమల్, దిముత్ కరుణరత్నే కూడా ఈ టూర్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

2009లో లాహోర్ లో శ్రీలంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో శ్రీలంక ఆటగాళ్లలో కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం విదేశీ జట్లు పాకిస్థాన్ లో పర్యటించాలంటే హడలిపోయే పరిస్థితి ఏర్పడింది.

More Telugu News