India: పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాట్లను వీడియో ఆధారాలతో సహా బయటపెట్టిన భారత సైన్యం

  • సరిహద్దు వద్ద పాక్ బ్యాట్ కమాండోల అలజడి
  • ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకున్న భారత ఆర్మీ
  • చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు
  • వీడియో ద్వారా వెల్లడి

కశ్మీర్ లోయలో ఎప్పటినుంచో అస్థిరత సృష్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న పాకిస్థాన్ ఇటీవల భారత సర్కారు ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి సరిహద్దు వద్ద చొరబాట్లను ముమ్మరం చేసింది. తన గడ్డపై శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్ లోకి పంపి విధ్వంసం సృష్టించడం అనేది పాక్ ఎప్పటినుంచో అనుసరిస్తున్న పంథా. గతంలో ఎన్నోసార్లు భారత్ దాయాది ప్రయత్నాలను వమ్ముచేసినా, తగిన ఆధారాలు లేక అంతర్జాతీయ వేదికలపై పాక్ ను దోషిగా నిలబెట్టడం సాధ్యమయ్యేది కాదు. కానీ ఈసారి భారత సైన్యం పక్కా ఆధారాలు సంపాదించింది.

ఇటీవలే పాక్ కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) ఎల్వోసీ వద్ద తరచుగా కలకలం రేపుతోంది. బ్యాట్ కమాండోల చాటున నక్కిన ఉగ్రవాదులు అనుకూల ప్రదేశంలో భారత్ లోకి ప్రవేశించాలన్న కుతంత్రాన్ని భారత సైనికులు భగ్నం చేశారు. బ్యాట్ కమాండోలు, ఉగ్రవాదుల శవాలు చెల్లాచెదరుగా పడివున్న దృశ్యాలను భారత్ ఆర్మీ బయటపెట్టింది. మృతదేహాల వద్ద పాకిస్థాన్ జెండాలు, ఇతర సామగ్రి కూడా ఓ వీడియోలో దర్శనమిస్తున్నాయి.

More Telugu News