VH: ఇలాంటి విషయాల్లో పవన్ కల్యాణ్ ముందుంటాడు: వీహెచ్

  • జనసేన కార్యాలయంలో పవన్ ను కలిసిన వీహెచ్
  • నల్లమల యురేనియం తవ్వకాలపై చర్చ
  • యురేనియం అంశాన్ని పవన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలడని చెప్పిన వీహెచ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేల ఎకరాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో మద్దతు కోరేందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లో జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. జనసేన కార్యాలయానికి వచ్చిన వీహెచ్ యురేనియం తవ్వకాల అంశంపై పవన్ తో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇలాంటి సామాజిక సమస్యలపై స్పందించడంలో పవన్ కల్యాణ్ ముందుంటాడని, ప్రజల్లోకి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లగలడని కితాబిచ్చారు. అందుకే తాను పవన్ కల్యాణ్ ను కలిశానని వివరించారు.

నల్లమలలో యురేనియం తవ్వకాల వల్ల అటవీప్రాంతం దెబ్బతింటుందని, వన్యప్రాణులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. నల్లమలలో యురేనియం తవ్వితే, అక్కడి జలాలు కృష్ణా నదిలో కలుస్తాయని, ఆ నీటిని హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ ప్రాంతాల వాళ్లు తాగుతారని, తద్వారా ప్రమాదకర అనారోగ్యం బారిన పడతారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోనూ కృష్ణా, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లోనూ ఈ నీటిని తాగుతారని చెప్పారు.

ఈ విషయం పవన్ కల్యాణ్ కు చెప్పగానే ఆయన వెంటనే స్పందించారని, బ్రదర్ మనం అఖిలపక్షం ఏర్పాటు చేద్దాం, నిపుణులతో సదస్సు ఏర్పాటు చేద్దాం అంటూ ముందుకువచ్చారని వీహెచ్ వెల్లడించారు. ప్రజల భవిష్యత్తును నాశనం చేసే యురేనియం ఎందుకని ప్రశ్నించారని, త్వరలోనే తమ పోరాటానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామని చెప్పారు.

More Telugu News