Syeraa: సైరా తన తండ్రికి ఇస్తున్న బహుమతి అని చెప్పారు: రామ్ చరణ్ పై సురేందర్ రెడ్డి వ్యాఖ్యలు

  • అక్టోబరు 2న రిలీజ్ అవుతున్న సైరా
  • ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ప్రతిష్ఠాత్మక చిత్రం
  • రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం!

మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా అక్టోబరు 2న రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము చిత్రీకరణ మొదలుపెట్టాక నిర్మాతగా రామ్ చరణ్ ఏ విషయంలోనూ వెనుకంజ వేయలేదని తెలిపారు. ముఖ్యంగా బడ్జెట్ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారని ప్రశంసించారు. ఈ సినిమా తన తండ్రికి ఇస్తున్న బహుమతి అని, బడ్జెట్ విషయంలో ఆలోచించవద్దని తనకు రామ్ చరణ్ చెప్పారని సురేందర్ రెడ్డి వెల్లడించారు. సైరా చిత్రం తెరవెనుక కథానాయకుడు రామ్ చరణేనని పొగడ్తల జల్లు కురిపించారు.

రామ్ చరణ్ కు చెందిన కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కిన  సైరా చిత్రానికి దాదాపు రూ.300 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. తెల్లదొరలపై కత్తిదూసిన తొలితరం స్వాతంత్య్ర  సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. దీంట్లో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటించగా, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్ ముఖ్యపాత్రలు పోషించారు.

More Telugu News