Iran: పాకిస్థాన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఇరాన్!

  • ఇరాన్ లోని రాయబార కార్యాలయంలో భారత వ్యతిరేక బ్యానర్లను ఏర్పాటు చేసిన పాక్
  • బలవంతంగా బ్యానర్లను తొలగించిన ఇరాన్ అధికారులు
  • ఇవి దౌత్య సిద్ధాంతాలకు వ్యతిరేకమన్న ఇరాన్

భారత్ పై అక్కసును వెళ్లగక్కుతున్న పాకిస్థాన్... వివిధ దేశాల్లోని తన రాయబార కార్యాలయాల్లో భారత వ్యతిరేక బ్యానర్లను, పోస్టర్లను ఏర్పాటు చేసింది. తద్వారా భారత్ ను అంతర్జాతీయంగా దోషిగా నిలబెట్టాలని యత్నించింది. అయితే, పాకిస్థాన్ కు ఇరాన్ షాకిచ్చింది. మషాద్ నగరంలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారత వ్యతిరేక బ్యానర్లను ఇరాన్ అధికారులు తొలగించారు. రాయబార కార్యాలయం గోడలపై ఉంచిన ఈ బ్యానర్లను ఆగస్ట్ 15వ తేదీ అర్ధరాత్రి బలవంతంగా తొలగించారు. 'కశ్మీర్ సంఘీభావ దినం' పేరిట పాక్ ఈ బ్యానర్లను ఏర్పాటు చేసింది.

అనంతరం, పాకిస్థాన్ చర్యలను ఇరాన్ ఎండగట్టింది. ఇలాంటి పనులు దౌత్యనీతిని దెబ్బతీస్తాయని చెప్పింది. ఓ దేశం గురించి ఇలాంటి బ్యానర్లను ఏర్పాటు చేయడం దౌత్య సిద్ధాంతాలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ లోని తమ రాయబార కార్యాలయం వద్ద సౌదీ అరేబియాకు వ్యతిరేకంగా తాము బ్యానర్లు ఏర్పాట్లు చేస్తే... మీ విదేశాంగశాఖ ఎలా స్పందిస్తుందని పాక్ రాయబారిని ఇరాన్ ప్రశ్నించింది. ఇరాన్ చర్యలతో పాకిస్థాన్ కంగుతుంది. అయినా తన తీరును సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఏదైనా ఒక సమాచారాన్ని ప్రదర్శించే హక్కు తమకు ఉందని ఓ లేఖ ద్వారా వెల్లడించింది.

More Telugu News