Australia: యాషెస్ సిరీస్: నాలుగో టెస్టులో ఆసీస్ ఘన విజయం

  • 2-1కి పెరిగిన ఆస్ట్రేలియా ఆధిక్యం
  • రెండో ఇన్నింగ్స్‌లో 197 పరుగులకే కుప్ప కూలిన ఇంగ్లండ్
  • స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

యాషెస్ సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 383 పరుగుల భారీ విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 197 పరుగులకే ఆలౌట్ అయింది. కమిన్స్ దెబ్బకు ఇంగ్లండ్ విలవిల్లాడింది. 43 పరుగులిచ్చిన కమిన్స్ 4 వికెట్లు పడగొట్టాడు. ఒకానొక దశలో ఇంగ్లండ్ 93 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

అయితే, డెన్లీ (53), రాయ్ (31)లు కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. గత మ్యాచ్‌లో జట్టును విజయ తీరాలకు చేర్చిన స్టోక్స్ (1) ఈసారి తీవ్రంగా నిరాశపరిచాడు. బెయిర్‌స్టో (25), బట్లర్ (34)లు కూడా విఫలం కావడంతో ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. చివర్లో ఒవర్టన్ (21), లీచ్ (12)లు బౌలర్లకు విసుగు తెప్పించారు. ఆసీస్ విజయాన్ని ఆలస్యం చేశారు.  మరో 15 ఓవర్లు కనుక వీరిద్దరూ క్రీజులో ఉంటే మ్యాచ్ డ్రా అయ్యేది. పది బంతుల తేడాతో వీరిద్దరూ పెవిలియన్ చేరడంతో విజయం ఆసీస్ సొంతమైంది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ చేసిన స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

More Telugu News