Vijayawada: చరిత్రపై అవగాహన కోసమే కాయిన్ ఎక్స్ పో: మంత్రి వెల్లంపల్లి

  • బెజవాడలో ముగిసిన అంతర్జాతీయ కాయిన్ ఎక్స్ పో
  • ఈ ఎక్స్ పో లో ప్రపంచంలోనే అతిపెద్ద వెండి నాణెం
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పది కిలోల నాణెం

చరిత్ర పై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసమే ‘కాయిన్ ఎక్స్ పో’ ఏర్పాటు చేశారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాయిన్ ఎక్స్ పో ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ ఎక్స్ పోలో పురాతన నాణేలు, నోట్లు, స్టాంపులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, పురాతన నాణేలు కనుమరుగవుతున్న తరుణంలో విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎక్స్ పో నిర్వహించడం గొప్ప విషయమంటూ నిర్వాహకులను అభినందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అతి చిన్న నోట్లు, ప్లాస్టిక్ నాణేలు, బ్రిటీష్ కాలము నాటి బంగారం వెండి రాగి నాణేలు, స్టాంపులు ప్రదర్శనలో ఉంచినట్టు చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద పది కేజీల వెండి నాణెం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఇది ఆస్ట్రేలియా దేశానికి చెందినదని అన్నారు. కాయిన్ కలెక్షన్ చేసే వారి సంఖ్య పెరుగుతోందని, ఈ ప్రదర్శన ద్వారా నాణేలు, నోట్లను ఎలా భద్రపరుచుకోవాలో వారికి నేర్పించామని నిర్వాహకులు చెప్పారు. విజయవాడ లో ఈ హాబీ ఉన్న వారితో అసోసియేషన్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

More Telugu News