Andhra Pradesh: ఏపీలో ‘రావాలి సీబీఐ కావాలి సీబీఐ’ అన్నారు.. ఇప్పుడెందుకు భయపడుతున్నారు?: నారా లోకేశ్ ఆగ్రహం

  • సీబీఐ వద్దని ఇప్పుడెందుకు అంటున్నారు
  • జీవితాంతం శుక్రవారం కోర్టుకెళ్లాలని భయమా?
  • ఏపీ ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై లోకేశ్ విమర్శలు

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ‘రావాలి సీబీఐ.. కావాలి సీబీఐ’ అన్నవాళ్లు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారని లోకేశ్ ప్రశ్నించారు.  బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన పెద్ద మనుషులు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ సీబీఐ వద్దు అని ఎందుకు అంటున్నారని నిలదీశారు.

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు ఆత్మహత్యలు చేసుకోవడం వెనుక రహస్యం ఏముందని అడిగారు. గతంలో ‘కోడికత్తి వెనుక మహాకుట్ర ఉంది. సీబీఐ విచారణ జరిపించాలి’ అని టీవీల్లో అరిచిన గ్యాంగ్ ఇప్పుడు మౌనంగా ఉందని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఈ కేసులో నిందితుడికి జైల్లోనే ప్రాణహాని ఉండే పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఒకవేళ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే నిజాలు బయటపడి జీవితాంతం శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారా? అని లోకేశ్ నిలదీశారు. ఈ మేరకు నారా లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.

More Telugu News