Chandrayan-2: చంద్రయాన్-2 ప్రయోగం.. ల్యాండర్ విక్రమ్ ఎక్కడుందో తెలిసిందన్న ఇస్రో!

  • చంద్రుడిపై ల్యాడర్ ను గుర్తించామని శివన్ ప్రకటన
  • కమ్యూనికేషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వ్యాఖ్య
  • నిన్న చంద్రుడిని సమీపంచగానే కనెక్షన్ కోల్పోయిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ డా.కె.శివన్ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్-2లో భాగంగా చంద్రుడిపైకి ప్రయోగించిన ల్యాండర్ ‘విక్రమ్’ ఎక్కడుందో తాము కనుగొన్నామని శివన్ తెలిపారు. ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్ విక్రమ్ కు సంబంధించిన ఫొటోలు(థర్మల్ ఇమేజ్ లు) తీసిందని వెల్లడించారు. ల్యాండర్ ను యాక్టివేట్ చేసేందుకు, సంకేతాలు పంపేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అయితే ఇంతవరకూ విక్రమ్ నుంచి తమకు ప్రతిస్పందన రాలేదని పేర్కొన్నారు.

త్వరలోనే ల్యాండర్, ఇస్రో భూకేంద్రం మధ్య సంబంధాల పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ జూలై 22న జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్బిటర్, ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ లను పంపింది. అయితే నిన్న తెల్లవారుజామున చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నించిన ల్యాండర్ విక్రమ్.. జాబిల్లి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తుకు దిగగానే, ఒక్కసారిగా సంకేతాలు తెగిపోయాయి.

More Telugu News