Cricket: సంజూ శాంసన్ పెద్ద మనసు.. మ్యాచ్ ఫీజు మొత్తం గ్రౌండ్ సిబ్బందికి ఇచ్చేసిన క్రికెటర్!

  • తిరువనంతపురంలో దక్షిణాఫ్రికా-ఏతో మ్యాచ్
  • వర్షం పడ్డా మైదానాన్ని మ్యాచ్ కు సిద్ధం చేసిన సిబ్బంది
  • సంజూ విజృంభణతో విజయం సాధించిన భారత్

భారత యువ క్రికెటర్ సంజూ శాంసన్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. మ్యాచ్ ఫీజుగా తనకు వచ్చిన నగదు మొత్తాన్ని మైదానం సిబ్బందికి విరాళంగా ఇచ్చేశాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో రెండ్రోజుల క్రితం వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు ముందు వర్షం కురవగా, మైదానం సిబ్బంది తీవ్రంగా శ్రమించి గ్రౌండ్ ను మ్యాచ్ కు సిద్ధం చేశారు.

కేవలం 20 ఓవర్లే జరిగిన ఈ మ్యాచ్ లో సంజూ కేవలం 48 బంతుల్లోనే 91 పరుగులు చేశాడు. దీంతో భారత్-ఏ జట్టు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, అనంతరం బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా కేవలం 168 పరుగులకే కుప్పకూలింది. దీంతో మైదానం సిబ్బంది వల్లే ఈ మ్యాచ్ సాధ్యమయిందని అభిప్రాయపడ్డ సంజూ శాంసన్, తనకు మ్యాచ్ ఫీజుగా అందే రూ.1.50 లక్షలను మైదానం సిబ్బందికి ఇస్తున్నట్లు ప్రకటించేశారు. కాగా, సంజూ నిర్ణయంపై పలువురు క్రికెట్ ప్రేమికులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More Telugu News