chennai: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉందని భార్యను హత్యచేసిన ప్రబుద్ధుడు

  • తిరుపతి తీసుకొచ్చి భార్యను హత్య చేసిన తమిళనాడు వాసి
  • లాడ్జి గదిలో బెల్టుతో మెడ బిగించి హత్య
  • అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కారణంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడో దుర్మార్గుడు. చెన్నైకి చెందిన మురుగన్-సింధియా (40)లు భార్యాభర్తలు. 20 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యను పట్టించుకోవడం మానేసిన మురుగన్ స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

విషయం తెలిసిన భార్య మురుగన్‌ను నిలదీసింది. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న మురుగన్ ఆమెను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా గత నెల 23న భార్యతో కలిసి తిరుపతి చేరుకున్నాడు. నగరంలోని  పీకే లేఅవుట్‌లోని లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోతుండగా బెల్టుతో భార్య మెడ బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం లాడ్జి నుంచి పరారయ్యాడు.

ఉదయం గదిలో చనిపోయిన మహిళను చూసిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మురుగన్ కనిపించకపోవడంతో అతడే ఈ హత్య చేసి ఉంటాడని భావించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

More Telugu News