Hyderabad: తెలంగాణలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదు

  • బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు
  • ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
  • అప్పట్లో బాధితురాలి పిటిషన్ స్వీకరించని కోర్టు

తెలంగాణలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ కృష్ణానగర్‌కు చెందిన సుమయబాను- టోలిచౌకికి చెందిన మహ్మద్‌ ముజామిల్‌ షరీఫ్‌ భార్యాభర్తలు. 2017లో వీరికి వివాహం అయింది. షరీఫ్‌ జెమ్స్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీలో కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా సుమయబాను గత కొంతకాలంగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో 2018లో ఆమె భర్తపై మహిళా పోలీస్ స్టేషన్‌లో వరకట్న వేధింపుల కింద ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

కాగా, తనపై కేసు పెట్టడంతో తట్టుకోలేకపోయిన షరీఫ్.. గతేడాది నవంబరు 28న భార్యకు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. అనంతరం ముమ్మారు తలాక్ చెప్పాడు. ఇకపై ఇద్దరికీ ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో సుమయబాను  పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు నాంపల్లి 13వ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పట్లో ఆమె పిటిషన్‌ను కోర్టు అనుమతించలేదు. అయితే, తాజాగా ట్రిపుల్ తలాక్ చట్టం రావడంతో ఆ చట్టం కింద తన భర్తపై కేసు నమోదు చేయాలని కోరుతూ సుమయబాను బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు షరీఫ్‌పై కేసు నమోదు చేశారు. కొత్తగా వచ్చిన ట్రిపుల్ తలాక్ చట్టం కింద తెలంగాణలో నమోదైన తొలి కేసు ఇదేనని పోలీసులు తెలిపారు.

More Telugu News