KCR: నేడు తెలంగాణ కేబినెట్ విస్తరణ.. కేటీఆర్, హరీశ్, సబితలకు చోటు!

  • నేటి సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణ స్వీకారం
  • ఆర్టీసీ చైర్మన్‌గా నాయిని నర్సింహారెడ్డి
  • శాసనమండలి చైర్మన్‌గా గుత్తా

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. నేటి సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త మంత్రులకు సంబంధించిన పేర్లను కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అందించారు. అలాగే, ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కేసీఆర్ ఆదేశించారు.

గవర్నర్‌కు ముఖ్యమంత్రి అందించిన జాబితాలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్‌ల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, మంత్రివర్గం నుంచి ఒకరిద్దరిని తొలగిస్తారని కూడా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాపై సబితకు మంచి పట్టు ఉండడంతో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆమెకు, గిరిజన మహిళ కోటాలో సత్యవతి రాథోడ్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, ఆర్టీసీ చైర్మన్‌గా మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని నియమించనున్నారు. శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయన నల్గొండ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు.

More Telugu News