Andhra Pradesh: తిరుమల నీటి కష్టాలకు చెక్.. బాలాజీ రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తామన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి!

  • బాలాజీ నుంచి కల్యాణి రిజర్వాయర్ కు తరలింపు
  • పాలక మండలిలో త్వరలోనే నిర్ణయం
  • గాలేరు-నగరి నుంచి నీటిని తరలించే ఛాన్స్

తిరుమలలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు బాలాజీ రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బాలాజీ రిజర్వాయర్ నుంచి మల్లెమడుగు మీదుగా కల్యాణి రిజర్వాయర్ కు నీటిని తరలిస్తామని వెల్లడించారు. ఈ రిజర్వాయర్ కు గాలేరు-నగరి ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే అవకాశముందని చెప్పారు.

బాలాజీ రిజర్వాయర్ లో ఎప్పుడూ 1 టీఎంసీ నిల్వ ఉంటుందనీ, కాబట్టి దాన్ని టీటీడీ అవసరాల కోసం వాడుకోవాలని నిర్ణయించామని పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి ఈరోజు టీటీడీ అధికారులతో కలిసి బాలాజీ రిజర్వాయర్ ను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో ఏర్పాటు కాబోయే టీటీడీ పాలక మండలి భేటీలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు తెలుగుదేశం పార్టీ సున్నితమైన అంశాలను రాజకీయం చేస్తోందని వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News