Telangana: కాపురంలో చిచ్చుపెట్టిన ‘కల్యాణలక్ష్మి’.. ఆత్మహత్య చేసుకున్న నవవధువు!

  • హైదరాబాద్ లోని హైదర్షాకోట్ ప్రాంతంలో ఘటన
  • డబ్బుల కోసం భార్యను వేధించిన సైకో భర్త
  • మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్న యువతి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం ఓ కుటుంబంలో అగ్గి రాజేసింది. కల్యాణ లక్ష్మి సొమ్ముతో పాటు అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధించుకుతినడంతో మానసికంగా కుంగిపోయిన భార్య ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నగరంలోని హైదర్షాకోట్ ప్రాంతంలో సురేష్ కుమార్-మమత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 3 నెలల క్రితం వివాహమయింది.

స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న సురేష్ కల్యాణలక్ష్మి పథకం కింద వచ్చిన నగదును తీసుకురావాలని భార్య మమత(24)ను వేధించడం మొదలుపెట్టాడు. అలాగే పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని వేధించసాగాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. భర్త సురేష్ తీరుతో తీవ్రంగా కుంగిపోయిన బాధితురాలు అతను బయటికెళ్లిన సమయంలో ఫ్యానుకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన నార్సింగ్ పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News